ఈ నెల 21 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 9 గంటలకు శాసన సభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 20న ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది.

అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయని తెలుస్తోంది. అవసరాన్ని బట్టి రెండు రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులు, కొన్ని కొత్త బిల్లులను ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది.


More Telugu News