భారత్ మండపంలోకి వరద.. కాంగ్రెస్ ప్రచారంపై పీఐబీ వివరణ

జీ20 సమావేశాలు జరిగిన భారత్ మండపంలోకి వరద నీరు చేరిందంటూ ఆదివారం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేతలు ఈ వీడియోను షేర్ చేస్తూ.. బీజేపీ అభివృద్ధి నీళ్లలో తేలుతోందంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియోలో భారత్ మండపం వేదిక వద్ద వరద నీటిని మెయింటనెన్స్ సిబ్బంది తొలగిస్తుండడం కనిపిస్తోంది. ఈ వీడియోపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది.

భారత్ మండపంలోకి వరద నీరు చేరిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అందులో వివరించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయంటూ పీఐబీ ఓ స్టేట్ మెంట్ విడుదల చేసింది. ఢిల్లీలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి భారత్ మండపం ప్రవేశ ద్వారం వద్ద వరద నీరు నిలిచిందని అందులో పేర్కొంది. ఆరుబయట ప్రాంతం కావడంతో నీళ్లు నిలిచాయని, వెంటనే మెయింటనెన్స్ సిబ్బంది తొలగించారని వివరించింది. ఇదంతా కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే పూర్తయిందని తెలిపింది. దీనివల్ల అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని పేర్కొంది.


PIB
Bharat Mandapam
Viral Videos
Fact check

More Telugu News