Tsunami Siren: ఉన్నట్టుండి మోగిన సునామీ సైరన్ తో హడలిపోయిన గోవా వాసులు

  • గోవాలో నిన్న రాత్రి సునామీ కలకలం
  • ఆగకుండా 20 నిమిషాల పాటు మోగిన సైరన్
  • భూకంపం లేకుండానే మోగిన సైరన్
  • సాంకేతిక లోపమే కారణమంటున్న అధికారులు
Goa people feres after Tsunami siren

గోవాలో అకస్మాత్తుగా సునామీ కలకలం రేగింది. ఎలాంటి భూకంపం లేకపోయినా, సునామీ సైరన్ మోగడంతో గోవా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఇక్కడి పోర్వోరిమ్ ప్రాంతంలో ఓ కొండపై ఈడబ్ల్యూడీఎస్ (ఎర్లీ వార్నింగ్ డిస్సిమినేషన్ సిస్టమ్)ను ఏర్పాటు చేశారు. ఈడబ్ల్యూఎస్ విపత్తులను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అయితే, బుధవారం రాత్రి ఇక్కడి సునామీ సైరన్ అదేపనిగా 20 నిమిషాల పాటు మోగింది. సైరన్ ఎంతకీ ఆగకపోవడంతో ప్రజలు హడలిపోయారు. చివరికి ఇది పొరబాటున మోగినట్టు గుర్తించారు. 

దీనిపై ఉత్తర గోవా జిల్లా కలెక్టర్ మము హేగే మాట్లాడుతూ, సాంకేతిక సమస్య వల్లే సైరన్ మోగిందని వెల్లడించారు. సైరన్ మోగడంపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ)తో మాట్లాడామని, సునామీకి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు లేవని వారు తమతో చెప్పినట్టు కలెక్టర్ వివరించారు. సైరన్ మోగడానికి గల కారణాలను గుర్తించాలని రాష్ట్ర జలవనరుల శాఖను కోరినట్టు తెలిపారు.

More Telugu News