Nalgonda: ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు.. పార్కులో పురుగు మందు తాగి ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

Two degree students attempt to suicide in Nalgonda
షార్ట్స్‌లో చూడండి
నల్గొండలో ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లికి చెందిన శివాని, అదే మండలంలోని అమ్మనబోలుకు చెందిన మనీషా నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ బీజడ్సీ సెకండియర్ చదువుతున్నారు. వసతిగృహంలో ఉంటున్న వారు నిన్న కాలేజీకి వెళ్తున్నట్టు చెప్పి ఓ ఫర్జిలైజర్ దుకాణంలో పురుగు మందు కొని రాజీవ్ పార్క్‌లో దానిని తాగారు. 

అనంతరం శివాని తన తండ్రికి ఫోన్ చేసి తనను క్షమించాలని, పురుగు మందు తాగానని చెప్పగా, మనీషా కూడా తన స్నేహితులకు ఫోన్ చేసి అదే విషయం చెప్పింది. అనంతరం ఇద్దరూ పార్క్ బయటకు వచ్చి స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

మేజిస్ట్రేట్ ఆసుపత్రికి వచ్చి వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు వేధిస్తున్నాడని ఒకరు చెప్పగా, తమకేమీ తెలియదని మరో విద్యార్థిని వాంగ్మూలం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం వారి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.
Go Back to Shorts
Nalgonda
Degree Students
Suicide

More Telugu News