హైదరాబాద్‌ వాసులకు అలర్ట్: మూసీ వరద కారణంగా మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత

  • ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న మూసీ నది
  • మూసారాంబాగ్ వద్ద బ్రిడ్జిని ఆనుకున్న మూసీ వరద
  • నేటి రాత్రి నుండి రాకపోకల నిలిపివేత
  • రేపటి పరిస్థితిని బట్టి రాకపోకలపై నిర్ణయం
తెలంగాణలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో చెరువులు నిండిపోయాయి. హైదరాబాద్‌లో వర్షాల కారణంగా మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ వరద నీరు మూసారాంబాగ్ వద్ద బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తోంది. దీంతో ఈ బ్రిడ్జిపై రాకపోకలను రాత్రి నుండి నిలిపివేశారు. అంబర్ పేట - దిల్ సుఖ్ నగర్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండడంతో... రేపు ఉదయం పరిస్థితిని బట్టి రాకపోకలను అనుమతించనున్నారు.

రాత్రి తొమ్మిది గంటల నుండి మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపి వేయనున్నట్లు అంతకుముందే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్‌ల నుండి ఆరువేల క్యూసెక్కుల నీరు మూసీలోకి వదలడంతో మూసారాంబాగ్ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం హిమయత్ సాగర్ కు 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, హిమయత్ సాగర్ నుండి 4,120 క్యూసెక్కుల నీరు మూసీలోకి వస్తోంది.

Hyderabad
rain
musi river

More Telugu News