బిగ్ బాస్-7: ఎప్పుడూ చివర్లో వచ్చే బ్రీఫ్ కేస్ ఈసారి ముందే వచ్చింది!

Bigg Boss season 7 latest updates
  • బిగ్ బాస్ కొత్త సీజన్ నేడు ప్రారంభం
  • కంటెస్టెంట్లను ఆరంభంలోనే బ్రీఫ్ కేస్ తో టెంప్ట్ చేసే ప్రయత్నం
  • రూ.5 లక్షలతో మొదలుపెట్టి రూ.35 లక్షల వరకు పెంచిన నాగ్
  • నో చెప్పిన కంటెస్టెంట్లు
తెలుగు తెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు 6 సీజన్లు విజయవంతంగా నడిచిన బిగ్ బాస్ షో... ఇవాళ ఏడో సీజన్ లో అడుగుపెడుతోంది. సాధారణంగా బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ లో మిగిలున్న కంటెస్టెంట్లను బ్రీఫ్ కేసులో నగదుతో ఊరిస్తుంటారు. కానీ, ఈసారి ఆ బ్రీఫ్ కేసు తొలిరోజునే వచ్చింది. 

అప్పటివరకు హౌస్ లో ప్రవేశించిన ప్రియాంక జైన్, శివాజీ, దామిని భట్ల, ప్రిన్స్ యావర్, శుభ శ్రీలను హోస్ట్ నాగార్జున టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. రూ.5 లక్షల నుంచి మొదలు పెట్టి రూ.35 లక్షల వరకు పెంచుకుంటూ పోయారు. 

ఆ బ్రీఫ్ కేసు తీసుకుని ఇప్పటికిప్పుడు వెళ్లిపోవచ్చని, అందులో ఉండే క్యాష్ వారి సొంతం అవుతుందని నాగ్ ఆఫర్ ఇచ్చారు. అయితే, కంటెస్టెంట్లు ఎవరూ ఆ బ్రీఫ్ కేసును తీసుకునేందుకు ఇష్టపడలేదు. దాంతో ఈ బ్రీఫ్ కేసును నాగ్ స్టోర్ రూమ్ కు పంపించేశారు. 

ఇక, బిగ్ బాస్ తాజా సీజన్ లో అలనాటి శృంగార తార షకీలా కూడా ఎంటరయ్యారు. ఆమెతో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు వచ్చి వీడ్కోలు పలికారు. ఓ దశలో షకీలా తీవ్ర భావోద్వేగాలకు లోనై కంటతడిపెట్టారు. ఆ ఇద్దరు ట్రాన్స్ జెండర్లు షకీలాను తల్లిగా భావించి, బరువెక్కిన గుండెలతో ఆమెను బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు. గత కొన్నేళ్లుగా తాను ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని, ట్రాన్స్ జెండర్ల సమాజంలో తనను కూడా ఆమోదించారని షకీలా వెల్లడించారు. వారిని తాను కన్నబిడ్డల్లా చూసుకుంటానని తెలిపారు. 

షకీలా తర్వాత ఆటా సందీప్, కార్తీకదీపం ఫేమ్ శోభా శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ కూడా హౌస్ లో ప్రవేశించారు.
Go Back to Shorts
Bigg Boss-7
Briefcase
Nagarjuna
Season-7
Telangana
Andhra Pradesh

More Telugu News