Vladimir Putin: ‘సారీ.. రాలేకపోతున్నా’ అంటూ మోదీకి పుతిన్ ఫోన్

  • జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు డుమ్మా
  • పుతిన్ స్థానంలో హాజరుకానున్న విదేశాంగ మంత్రి
  • వచ్చే నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో శిఖరాగ్ర సదస్సు
Putin dials PM Modi says Foreign Minister Lavrov to represent Russia at G20 Summit

ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డుమ్మా కొట్టనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మన ప్రధాని మోదీకి చెప్పినట్లు సమాచారం. సోమవారం ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్ చేసి చెప్పినట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న శిఖరాగ్ర సమావేశాలకు రాలేకపోతున్నానని, రష్యా తరఫున తమ విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ హాజరవుతారని పుతిన్ చెప్పారు.

ఈ ఫోన్ సంభాషణలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వివిధ అంశాలు పుతిన్, మోదీల మధ్య చర్చకు వచ్చాయని సమాచారం. జీ20 సదస్సుకు హాజరయ్యే విషయంలో పుతిన్ అశక్తతను అర్థం చేసుకున్నట్లు మోదీ చెప్పారు. అదేవిధంగా జీ20 ప్రెసిడెన్సీ విషయంలో భారత్ కు సహకరించినందుకు పుతిన్ కు మోదీ థ్యాంక్స్ చెప్పారు. కాగా, ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశాలకు కూడా పుతిన్ గైర్హాజరయ్యారు. ఉక్రెయిన్ లో పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళితే అరెస్టు చేసే అవకాశం ఉండడంతో పుతిన్ రష్యా సరిహద్దులు దాటడంలేదని ప్రచారం జరుగుతోంది.

More Telugu News