bjp: జన, కుల గణనపై అధికారం మాదే: కేంద్రం

  • వేరే ఎవ్వరికీ ఈ అధికారం లేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్
  • బీహార్ లో నితీశ్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై  సుప్రీంలో పిటిషన్
  • ఇది కేంద్ర పరిధిలోని అంశమని అఫిడవిట్ లో స్పష్టం చేసిన హోంశాఖ
Only Centre Can Conduct Caste Census  Supreme Court Told

దేశంలో జన గణన, కులాల వారీగా జనాభాను లెక్కించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర హోంశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం మినహా మరే ఇతర సంస్థకు జన, కుల గణన లేదా ఇందుకు సంబంధించిన ఏదైనా చర్యను నిర్వహించడానికి అర్హత లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. బీహార్‌లో కులగణన చేపట్టాలని రాష్ట్రంలోని నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. కులగణన అంశం కేంద్రం జాబితాలోనిదని, చట్ట ప్రకారం కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుందని పేర్కొంది.  

జన గణన అంశం రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో కేంద్ర జాబితాలో వుందని తెలిపింది. బీహార్‌లో కులగణనకు పాట్నా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ సందర్భంగా తమ రాష్ట్రంలో కుల గణనకు సంబంధించిన సర్వేలను ఆగస్టు 6 నాటికి నిర్వహించి, ఆగస్టు 12 నాటికి సేకరించిన డేటాను అప్‌లోడ్ చేసినట్లు బీహార్ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. కులాల వారీ సర్వే వల్ల కొన్ని పరిణామాలు ఉంటాయని చెప్పింది.

More Telugu News