Atchannaidu: వైసీపీ పాలనలో టీటీడీ పవిత్రతను మంటగలిపారు: అచ్చెన్నాయుడు

ఏపీ ప్రభుత్వం 24 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిని ప్రకటించగా, అందులో కొందరు వ్యక్తుల నియామకంపై విపక్షాలు భగ్గుమంటున్నారు. 

ఈ అంశంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. వైసీపీ పాలనలో టీటీడీ పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. ఓ క్రైస్తవుడ్ని టీటీడీ చైర్మన్ చేశారని, శరత్ చంద్రారెడ్డి వంటి వ్యక్తిని టీటీడీ సభ్యుడిగా చేశారని విమర్శించారు.

ఇక, ఇసుక సత్యాగ్రహం పేరుతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు చేపడుతున్నట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు. సెప్టెంబరు 1 నుంచి నెలన్నర పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యాచరణ ఉంటుందని వివరించారు. కోటి ఇళ్లకు వెళ్లేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజలకు వివరించాలని టీడీపీ శ్రేణులకు అచ్చెన్న పిలుపునిచ్చారు. 

ఆగస్టు 31న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకుంటుందని, యువగళం సంఘీభావ యాత్రలో ప్రభుత్వ బాధితులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 30 నియోజకవర్గాల్లో పర్యటిస్తారని  వెల్లడించారు. రాయలసీమ నుంచి చంద్రబాబు పర్యటన మొదలవుతుందని తెలిపారు. ఓటర్ల జాబితాల విషయంలో అందరూ అప్రమత్తం కావాల్సి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Atchannaidu
TTD
Christian
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News