NDA: సీట్లు తగ్గేది నిజమే.. అయినా మళ్లీ ఎన్డీయేకే పట్టం: ఇండియా టుడే సర్వే

దేశ ప్రజల్లో ప్రధాని మోదీ పట్ల ఇప్పటికీ మంచి ఆదరణే ఉన్నట్టు ఇండియా టుడే, సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో తెలిసింది. ఇప్పటికిప్పుడు లోక్ సభకు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 306 స్థానాలు సొంతం చేసుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 272 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఈ మ్యాజిక్ మార్క్ ను ఎన్డీయే సులభంగానే అధిగమిస్తుందని వెల్లడైంది. ఇక ఇటీవలే ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్ష కూటమికి 193 సీట్లు వరకు లభిస్తాయని ఈ సర్వే తెలిపింది. ఇతర పార్టీలకు 44 స్థానాలు వస్తాయని పేర్కొంది.

కాకపోతే 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన 352 స్థానాలతో పోలిస్తే ప్రస్తుతం 46 స్థానాలు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ఇండియా టుడే ఏటా రెండు సార్లు దేశల ప్రజ నాడి తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తూ వస్తోంది. 2020 జనవరిలో 303, అదే ఏడాది ఆగస్ట్ లో నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకి 316 స్థానాలు వస్తాయని తేలింది. 2021 జనవరిలో 321, అదే ఏడాది ఆగస్ట్ లో 298 స్థానాలు, 2022 జనవరిలో 296 స్థానాలు, 2022 ఆగస్ట్ లో 307 స్థానాలు, 2023 జనవరి నాటి సర్వేలో 298 స్థానాలు వస్తాయని తెలిసింది. అంటే స్వల్పంగా హెచ్చు, తగ్గులు కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఇండియా కూటమి (గతంలో యూపీఏ)కి 153  నుంచి 193కు స్థానాలు పెరిగాయి. 

ఎన్డీయేకి 43 శాతం ఓట్లు పడే అవకాశం ఉంటే, ఇండియా కూటమికి 41 శాతం మేర ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. విడిగా చూస్తే బీజేపీకి 287 స్థానాలు వస్తాయని సర్వేలో వెల్లడైంది. మెజారిటీ మార్క్ 272 కంటే ఎక్కువే సాధించనుంది. ఇది ప్రభుత్వంలో స్థిరత్వానికి మేలు చేయనుంది. విడిగా కాంగ్రెస్ 74 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి.
NDA
sweep again
majority win
INDIA
india today
mood of the nation
survey

More Telugu News