బీఆర్ఎస్ ఎంపీ ఫొటో బుక్ ఆవిష్కరించిన రామ్ చరణ్

  • పక్షుల ఫొటోలు తీసిన జోగినపల్లి సంతోష్ కుమార్
  • ఆ ఫొటోలతో వింగ్స్ ఆఫ్ ప్యాషన్ పుస్తకం
  • రామ్ చరణ్ నివాసంలో పుస్తకావిష్కరణ
  • జోగినపల్లి ప్రయత్నాన్ని కొనియాడిన గ్లోబల్ స్టార్
బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంతో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఆయన ఇప్పటికే గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పర్యావరణం పట్ల మమకారంతో ఆయన ప్రారంభించిన చాలెంజ్ లో భాగంగా ఇప్పటివరకు లక్షల మొక్కలు నాటడం తెలిసిందే. 

జోగినపల్లి సంతోష్ కుమార్ లో పక్షి, వన్యప్రాణి ప్రేమికుడు కూడా ఉన్నారు. ఆయన పక్షి ప్రపంచంలో తాను తీసిన ఫొటోలతో 'వింగ్స్ ఆఫ్ ప్యాషన్' అనే పుస్తకాన్ని రూపొందించారు. తాజాగా, ఈ వినూత్న పుస్తకాన్ని టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్కరించారు. 

వింగ్స్ ఆఫ్ ప్యాషన్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇవాళ రామ్ చరణ్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, పక్షులు కూడా మన తోటి జీవులేనని, వాటిని ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన అవసరాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన పుస్తకం ద్వారా చెప్పారని వెల్లడించారు. ప్రాణుల పట్ల ప్రేమ, దయ, సానుభూతి ఉంటే తప్ప, వాటి అద్భుతమైన తత్వాన్ని అవగాహన చేసుకోలేమని అన్నారు. 

పక్షులతో కలిసి ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి అని సంతోష్ కుమార్ తన పుస్తకంలో పేర్కొన్నారని, ఆ మాట తన హృదయాన్ని తాకిందని రామ్ చరణ్ పేర్కొన్నారు. 

ఇక, దేశంలో చాలామంది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు ఉన్నారని, కానీ రాజకీయ రంగం నుంచి వచ్చిన ఓ ఎంపీ అచ్చం ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ లాగా ఫొటోలు తీయడం, వాటిని పుస్తకంగా తీసుకురావడం బహుశా ఇదే ప్రథమం అనుకుంటానని అభిప్రాయపడ్డారు.

Ram Charan
Joginapalli Santosh Kumar
Photo Book
Wings Of Passion

More Telugu News