భారత జాతీయ గీతంపై ప్రత్యేక వీడియో.. రిక్కీ కేజ్ కు ప్రధాని అభినందనలు

  • గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ ప్రత్యేక కృషి
  • జనగణమన అధినాయక గేయం చిత్రీకరణ
  • 100 మంది బ్రిటిష్ ఆర్కెస్ట్రా బ‌ృందం సేవలు
  • భారతీయులు గర్వపడేలా చేస్తుందన్న ప్రధాని
భారత్ 77వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సంతోష వేళ.. గ్రామీ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు రిక్కీ కేజ్ భారతీయుల మనసు చూరగొనే ప్రయత్నం చేశారు. 100 మంది ఆర్కెస్ట్రా బృందంతో భారత జాతీయ గీతాన్ని చిత్రీకరించి, వీడియోని ఆయన విడుదల చేశారు. లండన్ లోని అబ్బే రోడ్ స్టూడియోస్ లో దీని చిత్రీకరణ జరిగింది. పేరొందిన బ్రిటిష్ రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా బృందం ఇందులో పాల్గొంది. 

భారత సంతతి వారి ప్రోత్సాహంతో కేజ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ‘‘కొన్నిరోజుల క్రితం నేను 100 మంది బ్రిటిషర్లతో కూడిన ఆర్కెస్ట్రాను చేపట్టాను. లండన్ లోని లెజెండరీ అబ్బే స్టూడియోస్ లో భారత జాతీయ గీతాలాపనకు వీలుగా రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా పాల్గొంది. భారత జాతీయ గీతం చిత్రీకరణకు ఇప్పటి వరకు వినియోగించిన అతిపెద్ద ఆర్కెస్ట్రా ఇదే. చివర్లో జయహే అన్న ఉచ్చారణతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కంపోజర్ గా గొప్ప అనుభూతిని పొందాను. ఈ చారిత్రాత్మక రికార్డింగ్ వీడియోని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా షేర్ చేస్తున్నాను. చూడండి. షేర్ చేయండి. అది కూడా గౌరవంతో చేయండి. ఇది ఇప్పుడు మీది. జైహింద్’’ అంటూ కేజ్ ట్వీట్ చేశారు. 

స్వాతంత్య్ర దినాన ప్రధాని మోదీ.. రిక్కీ కేజ్ చేసిన ప్రత్యేక కృషిపై స్పందించారు. కేజ్ చిత్రీకరణ అద్భుతంగా ఉందన్నారు. ఇది భారతీయులు అందరూ గర్వపడేలా చేస్తుందన్నారు. ఈ వీడియో ఒక నిమిషం నిడివితో ఉంది.

Grammy awardee
Ricky Kej
rendition
Indias national anthem
Prime Minister

More Telugu News