మొత్తానికి కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి.. కండువా కప్పిన ఖర్గే

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎట్టకేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఈ ఉదయం కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతోపాటు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, వనపర్తికి చెందిన మెగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి సహా పలువురు నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సంపత్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

వాస్తవానికి జూపల్లి గత నెల 20నే కాంగ్రెస్‌లో చేరాల్సి ఉండగా అప్పటి నుంచి ఇది వాయిదా పడుతూ వస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని జూపల్లి భావించారు. భారీ వర్షాల కారణంగా అది రద్దయింది. ఆ తర్వాత గత నెల 30న మరో ముహూర్తం ఖరారు చేసినా అది కూడా వాయిదా పడింది. చివరికి నిన్న చేరాలని భావించి ఢిల్లీ వెళ్లినా ఖర్గే అందుబాటులో లేకపోవడంతో కుదరలేదు. చివరికి ఈ ఉదయం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Jupally Krishna Rao
Congress
Telangana

More Telugu News