షర్మిల ఏపీలోకి వస్తే ఆ ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చు: రఘురామకృష్ణరాజు

  • లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి నాలుగైదు సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్న రఘురామ  
  • ముస్లింలు వైఎస్ ను చూసి వైసీపీకి ఓటు వేశారని వ్యాఖ్య   
  • వైసీపీకి 40 సీట్లు మాత్రమే రావొచ్చని జోస్యం
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లోకి వస్తే చాలా ప్రభావం ఉండవచ్చునని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... వివిధ సర్వే ఏజెన్సీల నివేదికలను చూస్తే తమ పార్టీకి కష్టాలు తప్పవనిపిస్తోందని, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి నాలుగు లేదా ఐదు స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఓటర్ మదిలో ఏముంది? అని మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పారు. 2009లో కాంగ్రెస్ విజయం సాధించిందని, ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్ కాస్తా వైసీపీగా రూపాంతరం చెందిందన్నారు. కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లు 2014లో, 2019లో వైసీపీకి వేశారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఆరు శాతం వరకు ఓట్లు వైసీపీకి నష్టం చేయనున్నట్లు తెలిపారు.

ముస్లింలు వైఎస్ ను చూసి వైసీపీకి ఓటు వేశారని, కానీ ఇకముందు కాంగ్రెస్ కు వేస్తారన్నారు. వైసీపీకి మంచి ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలలో కొంత మార్పు కనిపిస్తోందన్నారు. ఇదంతా కాంగ్రెస్ కు సానుకూలమన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఈసారి 40 సీట్లు మాత్రమే రావొచ్చునని జోస్యం చెప్పారు. సజ్జల కూడా ఎన్నికల గురించి మాట్లాడటం లేదన్నారు. ఏపీలో పొత్తులపై అధికారిక ప్రకటనకు కాస్త సమయం పట్టవచ్చునని, ప్రతిపక్షాల ఓట్లు చీలకపోవచ్చునన్నారు.

Raghu Rama Krishna Raju
YSRCP
YS Sharmila
Andhra Pradesh
Congress

More Telugu News