Andhra Pradesh: హెడ్‌సెట్‌తో డ్రైవింగ్ చేసే వారిపై 20వేల జరిమానా?.. క్లారిటీ ఇచ్చిన ఏపీ రవాణా శాఖ

  • హెడ్‌సెట్, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేసేవారిపై రూ.20 వేల జరిమానా అంటూ ఏపీలో ప్రచారం
  • ప్రజల్లో ఆందోళన రేకెత్తడంతో స్పందించిన ఏపీ రవాణా శాఖ కమిషనర్
  • ఈ నేరం చేసేవారిపై గరిష్ఠంగా రూ.10 వేలు మాత్రమే విధిస్తున్నామని క్లారిటీ,
  • ప్రస్తుత నిబంధనలు చాలాకాలంగా అమల్లో ఉన్నాయని వెల్లడి
AP transport department commissioner ends suspense over the news of imposing huge fine on drivers using headphones while driving

ఏపీలో హెడ్‌సెట్, ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేసే వాహనదారులపై రూ.20 వేల జరిమానా వడ్డిస్తారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రంలో కలకలం రేగుతోంది. దీంతో ఏపీ రవాణా శాఖ కమిషనర్ తాజాగా ఈ అంశంపై స్పందించారు. ఇదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేశారు. 

మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్‌‌ ఫోన్‌ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. పదేపదే ఇదే నేరం చేస్తే రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు విధిస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రూల్స్ చాలా కాలంగానే అమల్లో ఉన్నాయని చెప్పిన ఆయన, జరిమానా పెంపు ఆలోచన లేదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని సూచించారు.

More Telugu News