Muralidharan: ఏపీలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రోడ్ మ్యాప్: బీజేపీ ఇన్చార్జి మురళీధరన్

BJP AP affairs incharge Muralidharan talks about state politics
  • మంగళగిరిలో నేడు బీజేపీ పదాధికారుల సమావేశం
  • హాజరైన పురందేశ్వరి, మురళీధరన్
  • ఏపీలో వైసీపీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందన్న మురళీధరన్
  • ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం చూస్తున్నారని వెల్లడి
మంగళగిరిలో ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మురళీధరన్ మాట్లాడుతూ, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. 

వైసీపీ సర్కారు ప్రతి రంగంలో విఫలం కావడంతో, ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురుచూస్తున్నారని, ప్రజలు కోరుకున్న విధంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే సత్తా బీజేపీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో ఏపీ ప్రస్తావన వచ్చిందని మురళీధరన్ వెల్లడించారు. ఏపీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆ సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. 

రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రోడ్ మ్యాప్ రూపొందించుకోవాలని పార్టీ శ్రేణులకు మురళీధరన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని నిర్ణాయక శక్తిగా నిలపడమే బీజేపీ శ్రేణులకు లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.
Muralidharan
AP Incharge
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News