Chandrababu: వాలంటీర్ల వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

  • టీడీపీ మహిళా నేతలతో చంద్రబాబు సమావేశం
  • వాలంటీర్ల అంశం ప్రస్తావన
  • వాలంటీర్లు రాజకీయాలు చేయొద్దంటూ వార్నింగ్
  • వీళ్లెవరు ఇళ్లలోకి రావడానికి అంటూ చంద్రబాబు ఆగ్రహం
  • కొంపలు కూల్చే వ్యవహారాలు అంటూ వ్యాఖ్యలు
Chandrababu comments on volunteers issue

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాలంటీర్ల వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. వాలంటీర్లు ప్రజలకు అవసరమైన ప్రభుత్వ పనులు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. కానీ వాలంటీర్లు రాజకీయాలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. 

"వాలంటీర్లు... మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా... సైకో చెప్పిన పనులు చేయొద్దు. మీరు పార్టీ పనులు చేస్తే ఆ ఆడబిడ్డలు వదిలిపెట్టరు. మిమ్మల్ని కచ్చితంగా నిలదీస్తారు" అని హెచ్చరించారు. 

"నిన్న మొన్న వాలంటీర్ల గురించి వింటున్నా. అదిస్తాం, ఇదిస్తాం అంటూ ఇళ్లలోకి వస్తున్నారు. వీళ్లెవరండీ ఇంట్లోకి రావడానికి? ఇంట్లోకి రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. ఆ వివరాలు ఎలాంటివంటే... మీ ఆయనకు వేరే ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? మీకు ఏమైనా అనుమానం ఉందా? దీనర్థం ఏంటి... కొంపలు కూల్చే వ్యవహారమే కదా! 

మగవాళ్ల వద్దకు వెళ్లి మీ ఆడవాళ్లేమైనా బయట తిరుగుతున్నారా అని అడుగుతారు. ఈ విషయాలతో మీకేంటి సంబంధం? చెప్పుతో కొట్టేవాడు లేకపోతే... ఏంటివన్నీ జగన్ మోహన్ రెడ్డీ? వ్యక్తిగత గోప్యత ఉండాలా, వద్దా? మన విషయాలు వీళ్లకెందుకు? ఏ కుటుంబం ఎలా ఉంటే మీకెందుకు? దానిపై మళ్లీ సంతకం కూడా పెట్టాలంట! 

ఇతడ్ని నమ్ముకున్న అధికారులు జైలుకు వెళ్లారు. కొందరు అధికారులు గుండెపోటుకు గురై ఈ ఉద్యోగాలు వద్దని వెళ్లిపోయారు. మా ఆడబిడ్డలు ధైర్యసాహసాలు కలవారు. ఈ ప్రభుత్వ చర్యలను గట్టిగా ఎదుర్కొంటారు" అంటూ చంద్రబాబు పార్టీ మహిళా నేతలతో సమావేశంలో వ్యాఖ్యానించారు.

More Telugu News