ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 60 మందిని రక్షించిన రాజుకు అస్వస్థత

  • భువనగిరి సమీపంలో ఇటీవల రైలులో అగ్నిప్రమాదం
  • ప్రమాదాన్ని ముందే పసిగట్టి చైన్ లాగి రైలును ఆపిన రాజు
  • ఆ సమయంలో దాదాపు 45 నిమిషాలపాటు పొగ పీల్చడంతో అస్వస్థత
  • నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్పృహతప్పి పడిపోయిన రాజు
ఇటీవల జరిగిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి పలువురు క్షేమంగా బయటపడడానికి కారణమైన సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని లక్ష్మీనగర్ నివాసి సిగల్ల రాజు నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో స్పృహతప్పి పడిపోయాడు. తల్లి ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ఇంటికొచ్చి చూడగా కిందపడిపోయి కనిపించాడు. దీంతో వెంటనే సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. రాజు చాతీనొప్పి, తలనొప్పితో బాధపడుతున్నట్టు తల్లి పార్వతి తెలిపారు. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు ఐడీఏ బొల్లారంలో ఓ కంపెనీలో పదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల పర్లాకిమిడి వెళ్లిన రాజు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో తిరిగి వస్తుండగా భువనగిరి సమీపంలో రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన రాజు వెంటనే చైన్‌లాగి రైలును ఆపాడు. ఆపై 60 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందికి దిగేందుకు సాయం చేశాడు. ఈ క్రమంలో దాదాపు గంటపాటు పొగ పీల్చడంతో స్పృహతప్పి పడిపోయాడు. రైల్వే సిబ్బంది భువనగిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


More Telugu News

Sigalla Raju Falknuma Express Rail Falknuma Rail Accident