Nirmala Sitharaman: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ.. క్యాన్సర్ మందులకు మినహాయింపు: కేంద్ర మంత్రి నిర్మల

  • క్యాసినో, గుర్రపు పందేలు వంటి బెట్టింగులపై అధిక జీఎస్టీ
  • అరుదైన వ్యాధులతో బాధపడే రోగులు దిగుమతి చేసుకునే ఆహారంపై మినహాయింపు
  • థియేటర్లలో విక్రయించే ఫుడ్‌పై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
GST Council Decides To Impose 28 percent Tax On Turnover Of Online Gaming Firms

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన 50వ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలు వంటి బెట్టింగులపై 28 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలని నిర్మల మీడియా సమావేశంలో వెల్లడించారు.

బెట్టింగులపై మంత్రుల బృందం సిఫార్సులకు అనుగుణంగా జీఎస్టీ రేటును నిర్ణయించినట్లు చెప్పారు. ఆన్ లైన్ గేమింగ్‌పై తొలుత ముఖ విలువపై పన్ను వేయాలా? గేమింగ్ ఆదాయంపై పన్ను వేయాలా? ప్లాట్ ఫామ్ ఫీజు మీద మాత్రమే వేయాలా? అనే అంశంపై మంత్రుల బృందం చర్చించిందని, చివరకు మొత్తం విలువ మీద పన్ను విధించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినా, డబ్బులతో ఆడే ఆట అయినా ఆన్ లైన్ గేమ్ లకు 28 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. మరోవైపు, క్యాన్సర్ మెడిసిన్ దినుటక్సిమాబ్, ఇతర అరుదైన వ్యాధులతో బాధపడే రోగులు దిగుమతి చేసుకునే ఆహారంపై జీఎస్టీ మినహాయంపు ఇచ్చింది. ప్రయివేటు కంపెనీల ఉపగ్రహ ప్రయోగ సేవలకు జీఎస్టీ మినహాయింపు ఉంటుందన్నారు. సినిమా థియేటర్లలో విక్రయించే ఆహార పదార్థాలు, పానీయాలపై పన్నును 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది.

More Telugu News