Telangana: కేసీఆర్​ చెబుతున్న తెలంగాణ ‘అభివృద్ధి’పై మహారాష్ట్ర జర్నలిస్టుల ఆరా!

  • మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణపై ఫోకస్ పెట్టిన కేసీఆర్
  • ఆయన చెబుతున్న తెలంగాణ మోడల్ అభివృద్ధిపై 
    అధ్యయనం చేస్తున్న మహారాష్ట్ర కాంగ్రెస్ 
  • జర్నలిస్టు బృందాన్ని పంపించిన ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్! 
Maharashtra journalists study Telangana development

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రపై ఫోకస్ పెట్టారు. మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలను పార్టీలో చేర్చుకుంటున్న కేసీఆర్.. ఇప్పటికే ఐదుసార్లు మహారాష్ట్రకు వెళ్లొచ్చారు. తెలంగాణ మోడల్‌ ను అమలు చేస్తామంటూ మహారాష్ట్రలో జరిగిన సభల్లో చెబుతున్నారు. తెలంగాణను అభివృద్ధి చేసినట్లుగా, ఆ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేస్తానని అంటున్నారు.

 ఈ క్రమంలో  కేసీఆర్ చెబుతున్న మాటల్లో నిజమెంత అనేది తెలుసుకోవాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు మహారాష్ట్ర జర్నలిస్టుల బృందాన్ని చవాన్ తెలంగాణకు పంపించారని సమాచారం. ఆరుగురు సభ్యులతో కూడిన మహారాష్ట్ర జర్నలిస్టుల బృందం కొన్ని రోజులుగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తోంది. 

అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతల నుంచి ఆరా తీసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ తదితర ప్రముఖులను కూడా కలిసింది. కేసీఆర్ చెబుతున్న మాటలు, చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత? అసలు తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉంది? రాజకీయ పరిస్థితి ఏమిటి? అనే వివరాలపై ఆరా తీసినట్టు సమాచారం. 

ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వ అనుకూల వర్గాలు, రైతులు, దళితులు, ఇతర కులాల వారిని కలిసి వారి అభిప్రాయాలతో రూపొందించే నివేదికను అశోక్ చవావ్ కు జర్నలిస్టుల బృందం అందజేయనుందని తెలుస్తోంది. తెలంగాణలో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని తద్వారా మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు కౌంటర్ ఇవ్వాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

More Telugu News