Bandi Sanjay: కిషన్ రెడ్డి, ఈటల నియామకంపై తొలిసారి స్పందించిన బండి సంజయ్

  • ఇద్దరికీ అభినందనలు చెబుతూ ట్వీట్
  • వారి నాయకత్వంలో పార్టీ బలోపేతం అవ్వాలని ఆకాంక్ష
  • సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి నియామకం
  • రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటలకు బాధ్యతలు
Bandi Sanjay wishes kishan reddy and etela rajender

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి మార్పు తర్వాత ఎంపీ బండి సంజయ్ కుమార్ తొలిసారి స్పందించారు. నూతన అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించిన అధిష్ఠానం కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది.

సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. తనకు మంత్రి పదవిపై ఆసక్తి లేదని, అధ్యక్షుడిగా కొనసాగుతానని పార్టీ పెద్దలకు సంజయ్‌ స్పష్టం చేసినా.. అధిష్ఠానం పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో సంజయ్‌ అసంతృప్తికి లోనయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యంగా అయినా.. కిషన్ రెడ్డి, ఈటలకు అభినందనలు తెలుపుతూ సంజయ్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

‘బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు కిషన్‌ రెడ్డి గారికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి అభినందనలు. అనుభవజ్ఞులైన, సమర్థులైన మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

More Telugu News