నియోజకవర్గాల ఇన్చార్జిల పనితీరుపై చంద్రబాబు సమీక్ష

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, నియోజకవర్గాల ఇన్చార్జిల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గ ఇన్చార్జి పనితీరు గ్రాఫ్ పై క్షుణ్నంగా సమీక్ష చేపట్టారు. 

పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలపైనా ఈ సమావేశంలో చంద్రబాబు దృష్టి సారించారు. ప్రత్యేకించి తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో విభేదాలపై ఈ సమీక్షలో ప్రస్తావించారు. గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి మద్దిపాటి వెంకటరాజు, సీనియర్ నేత బాపిరాజుతో మాట్లాడారు. 

ఇక, పార్టీలో చేరికలు, భవిష్యత్తుపై గ్యారెంటీ కార్యక్రమంపైనా చంద్రబాబు నేతలతో చర్చించారు. పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలకు నూతన ఇన్చార్జిల నియామకంపైనా కసరత్తు చేశారు. ఇప్పటికే 43 మంది ఇన్చార్జిలతో చంద్రబాబు ఒక్కొక్కరితో విడిగా సమావేశమయ్యారు. 

కాగా, జులై రెండోవారం నుంచి చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో పాటు యువగళం కార్యక్రమాల్లోనూ పాల్గొనేలా టీడీపీ వర్గాలు రూట్ మ్యాప్ ను రూపొందించనున్నాయి.

Chandrababu
Review
Incharges
Constituency
TDP

More Telugu News