Apsara: అప్సర కేసులో మరో కోణం.. ఆమె వల్లే తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడన్న కార్తీక్ రాజా తల్లి

  • సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కార్తీక్ రాజాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అప్సర
  • అప్సర వేధింపులు భరించలేక కార్తీక్ సూసైడ్ చేసుకున్నాడన్న ఆయన తల్లి
  • పోలీస్ కేసు పెట్టి జైలుకు పంపించిందని వెల్లడి
Apsara first husband committed suicide

హైదరాబాదులో జరిగిన అప్సర హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అప్సరకు ఇదివరకు పెళ్లి అయినట్టు పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కార్తీక్ రాజాను అప్సర ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఆధారాలను కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి విడుదల చేశారు. అప్సర వేధింపులను తట్టుకోలేకే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె తెలిపారు. 

లగ్జరీగా బతికేందుకు తన కొడుకుని వేధించేదని, ఎంజాయ్ మెంట్ కోసం టూర్లకు తీసుకెళ్లాలని టార్చర్ పెట్టేదని ధనలక్ష్మి చెప్పారు. తన కొడుకుతో ప్రతి రోజు గొడవలు పడేదని, ఒక రోజు తన కొడుకుపై కేసు పెట్టిందని తెలిపారు. దీంతో పోలీసులు తన కొడుకును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని, దీన్ని కార్తీక్ తట్టుకోలేకపోయాడని చెప్పారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కుంగిపోయాడని, అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తన కొడుకు చావుకు అప్సర, ఆమె తల్లే కారణమని చెప్పారు. 

తన కొడుకు ఆత్మహత్య చేసుకున్న తర్వాత అప్సర, ఆమె తల్లి ఇద్దరూ కనిపించలేదని తెలిపారు. అప్సర, ఆమె తల్లి హైదరాబాదులో ఉన్నట్టు ఆమె హత్యకు గురైన వార్తలను చూసే తెలుసుకున్నానని చెప్పారు. అప్సరకు సినిమాల్లో నటించాలనే కోరిక కూడా ఉండేదని తెలిపారు. అందుకే వీరు హైదరాబాద్ కు వెళ్లి ఉండొచ్చని అన్నారు.

More Telugu News