Old Man: రైలు ప్రమాదంలో వృద్ధుడు వెదుకుతున్న కొడుకు దొరికాడు... కానీ!

  • ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం
  • 288 మంది మృతి
  • తమ వాళ్లు కానరాక కుటుంబ సభ్యులు, బంధువుల వేదన
  • కొడుకు ఆచూకీ కోసం 24 గంటలు వెదికిన వృద్ధ తండ్రి
Old man found son dead body in Odisha train accident

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల సంఖ్యలో మృతి చెందారు. పట్టాలు తప్పిన రైలు బోగీల్లో  కొన్ని మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో దర్శనమిచ్చాయి. ఏ అవయవం ఎవరిదో తెలియని దారుణ పరిస్థితి నెలకొంది. 

ఆ రోజున కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన తమ వాళ్లు కానరాక అయినవాళ్ల వేదన వర్ణనాతీతం. కాగా, ఓ వృద్ధుడు తన కుమారుడి కోసం వెదికిన తీరు అందరినీ కలచివేసింది. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులన్నీ తిరిగిన ఆ వృద్ధుడు... ప్రతి ఆసుపత్రిలో ఉన్న మార్చురీలోనూ కుమారుడి కోసం అన్వేషించాడు. 

మార్చురీలో ఒక్కో శవంపై ఉన్న ముసుగును తొలగించి చూసే క్షణాల్లో ఆ వృద్ధుడి గుండె కొట్టుకున్న తీరు ఓ తండ్రి మనసుకు నిదర్శనంగా నిలిచింది.

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో కొడుకు వస్తుండడంతో అతడి కోసం ఎదురుచూస్తున్న ఆ వృద్ధ తండ్రిని రైలు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. వెంటనే ప్రమాద ఘటన స్థలానికి వెళ్లిన ఆ వృద్ధుడు గాయపడ్డవారిని తరలించిన ఆసుపత్రులన్నీ తిరిగాడు. 

గంట రెండు గంటలు కాదు... ఏకంగా 24 గంటల పాటు కొడుకు కోసం వెదుకుతూనే ఉన్నాడు. ఓ స్కూల్లో కొన్ని మృతదేహాలు  ఉన్నాయంటే అక్కడికీ వెళ్లాడు. ప్రతి ముసుగు తీయడం... నా బిడ్డ కాదు అని కొద్దిగా ఊరట పొందడం... ఇలా సాగింది అతడి అన్వేషణ! 

అయితే, విషాదకర రీతిలో కొడుకు మృతదేహం ఆ తండ్రి కంటబడింది. దాంతో ఆ పెద్దాయన గుండె పగిలినంత పనైంది. కనీసం గాయాలతో ఉన్నా ఫర్వాలేదు అని భావించిన ఆ వృద్ధుడు.. ఏదైతే జరగకూడదని భావించాడో అదే జరగడంతో భోరున విలపించాడు. చివరికి బరువెక్కిన గుండెతో కొడుకు మృతదేహాన్ని తీసుకుని అక్కడ్నించి తరలిపోయాడు.

More Telugu News