అంగరంగ వైభవంగా పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమం.. రాజదండాన్ని లోక్సభలో ప్రతిష్టించిన మోదీ
- మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
- నూతన పార్లమెంటు భవనం వద్ద శృంగేరీ పీఠాధిపతుల స్వాగతం
- స్పీకర్, మంత్రులతో కలిసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న మోదీ
- రాజదండానికి సాష్టాంగ ప్రమాణం
- పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేసిన మోదీ
అప్పటికే రాజదండానికి (సెంగోల్)కు పూజలు నిర్వహించగా మోదీ దానికి సాష్టాంగ ప్రమాణం చేశారు. అనంతరం అధీనం మఠాధిపతులు దానిని ప్రధానికి అందజేశారు. రాజదండాన్ని తీసుకెళ్లి లోక్సభలోని స్పీకర్ కుర్చీ వద్ద ప్రతిష్ఠించిన మోదీ.. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మఠాధిపతుల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు. అంతకుముందు జరిగిన సర్వమత ప్రార్థనల్లో స్పీకర్ ఓం బిర్లా, కేబినెట్ మంత్రులతో కలిసి మోదీ పాల్గొన్నారు. పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను మోదీ సన్మానించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించి కొత్త పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేశారు.