పవన్ కల్యాణ్ పొత్తు ప్రతిపాదనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందన

  • పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకే ఏపీలో పొత్తులు ఉంటాయన్న ఎంపీ
  • ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ ప్రతిపాదించారని వెల్లడి
  • కర్ణాటకలో బీజేపీ ఓట్ల శాతం తగ్గలేదని జీవీఎల్ వివరణ
ఆంధ్రప్రదేశ్ లో ఇతర పార్టీలతో పొత్తులకు సంబంధించి తుది నిర్ణయం బీజేపీ జాతీయ నాయకత్వానిదేనని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వ నిర్ణయం మేరకే రాష్ట్రంలో పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదన చేశారని వివరించారు. ఈ ప్రతిపాదనను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని జీవీఎల్ చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు చెప్పారని వివరించారు.

కర్ణాటకలో బీజేపీ ఓటమిపైనా ఎంపీ జీవీఎల్ స్పందించారు. గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్ల షేర్ ను ఏమాత్రం కోల్పోలేదని, గతంలో సాధించిన 36 శాతం ఓట్లను ఈసారి కూడా పార్టీ దక్కించుకుందని వివరించారు. కర్ణాటక ప్రజల్లో బీజేపీకి ఆదరణ తగ్గలేదని పేర్కొన్నారు. అయితే, గత ఎన్నికల్లో జేడీఎస్ కు ఓట్లేసిన జనం ఈసారి కాంగ్రెస్ వైపు మళ్లారని, దీంతో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకుందని తెలిపారు. స్థానిక అంశాల ప్రాతిపదిక ఆధారంగా జరిగిన ఈ ఎన్నికలు మిగతా రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపలేవని తెలిపారు.

Andhra Pradesh
Pawan Kalyan
Janasena
BJP
GVL Narasimha Rao
alliance

More Telugu News