Manipur violence: మూకదాడికి గురైన మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే పరిస్థితి విషమం

BJP MLA attacked by mob in Imphal critical
  • మణిపూర్ లో మైతేయీ తెగకు ఎస్టీ హోదాపై గిరిజనుల నిరసన
  • ఆ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ గిరిజనుల ఆందోళన
  • సీఎంను కలిసి వచ్చిన ఎమ్మెల్యే వంగ్‌జాగిన్ వాల్టేపై దాడి
గిరిజనులు, గిరిజనేతరులైన మైతేయీల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ హింసాత్మకంగా మారింది. ఎస్టీ హోదా కల్పించాలన్న మైతేయీల డిమాండ్‌పై నాలుగు వారాల్లో కేంద్రానికి సిఫారసు పంపాలని ఇటీవల మణిపూర్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఆల్‌ ట్రైబల్‌ స్టూటెండ్స్‌ యూనియన్‌ (ఏటీఎస్‌యూఎమ్‌) మణిపూర్‌ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఏటీఎస్‌యూఎం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసనకు దిగారు. పలుచోట్ల ఇరు వర్గాలు దాడులకు దిగి ఇళ్లు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగులబెట్టారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌తో సమావేశమై రాష్ట్ర సచివాలయం నుంచి తిరిగి వస్తుండగా గురువారం ఇంఫాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే వంగ్‌జాగిన్ వాల్టేపై ఆందోళనకారులు దాడి చేశారు.

పెర్జాల్ జిల్లాలోని థాన్లోన్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాల్టే ఇంఫాల్‌లోని తన అధికారిక నివాసానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. దాడిలో ఎమ్మెల్యేతో పాటు ఆయన డ్రైవర్ గాయపడ్డాడు. ఇద్దరినీ వెంటనే ఇంఫాల్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ఎమ్మెల్యే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

కాగా, రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. హింసకు సంబంధించి తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు మణిపూర్‌లో పరిస్థితిపై కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. అదనపు పారా మిలటరీ బలగాలను ఆ రాష్ట్రానికి పంపింది. ఇప్పటి వరకు హింసాత్మక ప్రాంతాల నుంచి 9 వేల మంది ప్రజలను సైన్యం రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించింది.

More Telugu News

Manipur violence
BJP MLA
mob attack
critical