PSLV C-55: శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-55

  • షార్ నుంచి ఇస్రో వాణిజ్యపరమైన ప్రయోగం
  • రెండు సింగపూర్ శాటిలైట్లను మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-55
  • సాఫీగా సాగిన కౌంట్ డౌన్
  • నిర్దిష్ట సమయానికే గాల్లోకి లేచిన రాకెట్
  • రాకెట్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు
PSLV C55 launched successfully from Sriharikota

సింగపూర్ భూ పరిశీలన ఉపగ్రహాలను మోసుకుంటూ పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ రోదసి దిశగా పయనం ఆరంభించింది. 

741 కిలోల టెలియోస్-2 శాటిలైట్, 16 కిలోల లూమాలైట్-4 నానో శాటిలైట్లను ఈ రాకెట్ నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది. సింగపూర్ భూ పరిశీలనకు, సముద్ర భద్రతకు ఈ ఉపగ్రహాలు సేవలు అందించనున్నాయి. 

ఇస్రో పూర్తి వాణిజ్య ప్రాతిపదికన ఈ రాకెట్ ప్రయోగం చేపట్టింది. కాగా, ఈ రాకెట్ ప్రయోగం కోసం నిన్న ప్రారంభమైన కౌంట్ డౌన్ సజావుగా జరిగింది. ఎలాంటి లోపాలు, అవాంతరాలు లేకపోవడంతో నిర్దిష్ట సమయానికే రాకెట్ గాల్లోకి లేచింది. 

ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు వివిద దశల్లో  ఈ రాకెట్ గమనాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

More Telugu News