తెలంగాణలో రేపు, ఎల్లుండి వడగళ్ల వర్షం

  • పలు జిల్లాలకు అరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • 30–40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరిక
  • నిన్న సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం
తెలంగాణలో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. పగలు ఎండ, ఉక్కపోత ఉంటే సాయంత్రానికి భారీ వర్షం పడుతోంది. బుధవారం హైదరాబాద్ ప్రజలు అలాంటి పరిస్థితినే చూశారు. ఈ క్రమంలో శుక్ర, శనివారాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వడగళ్లు పొంచి ఉండటంతో రైతులు తమ పంటలను కాపాడుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. వీటి ప్రభావం ఉండే జిల్లాల కలెక్టర్లకు తమ బులెటిన్ ను పంపించింది.

rain
Hailstorm
Telangana

More Telugu News