Chandrababu: ఆ రోజున నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు: చంద్రబాబు

Chandrababu speech in TDP Foundation Day meeting
షార్ట్స్‌లో చూడండి
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. హైదరాబాదులో నిర్వహించిన పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. 

"దేశవిదేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరపాలని నిర్ణయించాం. ఇవాళ మొట్టమొదటి మీటింగ్ పెట్టాం... మళ్లీ రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తాం. ఈ మధ్యలో 98 సభలు జరుపుతాం. ఇది మొదటి మీటింగ్ అయితే, రాజమండ్రిలో 100వ మీటింగ్ జరుగుతుంది. 

తెలుగుజాతి గర్వపడే విధంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో చేస్తాం, ఆంధ్రప్రదేశ్ లో అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తాం. ఆస్ట్రేలియాలో చేస్తాం, అమెరికాలో కూడా చేస్తాం. ఎన్టీఆర్ వంటి మహనీయుడ్ని అందరూ గౌరవించుకోవాలి. అలాంటి మహనీయుడ్ని గౌరవిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.100 ప్రత్యేక నాణెం తీసుకువచ్చింది. అందుకు ప్రధాని మోదీకి మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని వివరించారు. 

టీడీపీకి ఎప్పుడూ స్పష్టమైన విజన్ ఉందని అన్నారు. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, 93లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని తెలిపారు. "ఈ రెండింటిని అందిపుచ్చుకుంటే ప్రపంచంలో తెలుగుజాతికి తిరుగుండదని ఆ రోజు నుంచే భావించాం. అందుకే విజన్ 2020 రూపొందించాం. 25-35 ఇంజినీరింగ్ కాలేజీలు ఉంటే వాటి సంఖ్యను 300 చేశాం. నన్ను ఆ రోజు ఎవరూ అర్ధం చేసుకోలేదు. ఇంజినీరింగ్ కాలేజీలు ఎందుకన్నారు. కానీ ఇవాళ ఆ కాలేజీ వల్ల ఎందరి జీవితాలు మారాయో, ఎందరు కోటీశ్వర్వులు అయ్యారో అందరికీ తెలుసు. 

పాతికేళ్ల కిందట హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది? హైటెక్ సిటీ తీసుకువచ్చాను, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను. ఆర్టీసీలో కండక్టర్లుగా ఆడబిడ్డలను పనిచేస్తున్నారు. అదీ తెలుగుదేశం గొప్పదనం. ఈ సందర్భంగా సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావుకు ఘన నివాళి అర్పిస్తున్నాను. దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారు. నాడు ఆయన తీసుకువచ్చిన సంస్కరణలను నేను ధైర్యంగా అనుసరించి రెండో తరం సంస్కరణలు రూపొందించాను. వాటికి టెక్నాలజీ జోడించాను.  

విజన్ 2020ని రూపొందించింది అప్పుడే. చాలామంది దాన్ని 420 విజన్ అన్నారు. ఇప్పుడా 420లు అడ్రస్ లేకుండా పోయారు. నాడు సెల్ ఫోన్ తిండి పెడుతుందా అన్నారు. ఇవాళ అందరి వద్ద సెల్ ఫోన్లు ఉన్నాయి. భర్త లేకుండా భార్య ఉంటుంది... భార్య లేకుండా భర్త ఉంటాడు... కానీ సెల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండరు. నేను సెల్ ఫోన్ తీసుకువచ్చినట్టు చెప్పుకుంటున్నానని చాలామంది ఎగతాళి చేస్తున్నారు. సెల్ ఫోన్ తీసుకువచ్చింది నేను కాదు... నేను ఇచ్చిన రిపోర్ట్ వల్లే భారత్ లో సెల్ ఫోన్లు వచ్చాయి. ఇదే కాదు... అనేక సంస్కరణలకు టీడీపీ పాటుపడింది" అని చంద్రబాబు వివరించారు.
Go Back to Shorts
Chandrababu
TDP
Foundation Day
Hyderabad
Andhra Pradesh
Telangana

More Telugu News