Jada Sravan Kumar: ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని ఛీకొట్టారు.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదు: జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్

  • ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్ కు చెంపపెట్టన్న శ్రవణ్
  • వైసీపీ ఆగడాలను ప్రజలు గుర్తించారని వ్యాఖ్య
  • ఇప్పటికైనా అమరావతిని గుర్తించాలని హితవు
North Andhra people rejected Jagan says Jada Sravan Kumar

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్ కు చెంపపెట్టు వంటివని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. అధికార పార్టీ ఆగడాలను ప్రజలు గుర్తించారని చెప్పారు. విశాఖ రాజధాని అంటూ ఊదరగొడుతున్న వైసీపీని ఉత్తరాంధ్ర ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అధికార పార్టీని ఛీకొట్టారని చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. 

ఇప్పటికైనా మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేయడం మానేయాలని హితవు పలికారు. అమరావతిని రాజధానిగా గుర్తించి, అభివృద్ధి చేయాలని సూచించారు. నాలుగేళ్ల కాలంలో జగన్ ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని గ్రాడ్యుయేట్లు తిరస్కరించారని... రాబోయే రోజుల్లో రైతులు, వ్యాపారులు, ప్రజలంతా ఛీకొడతారని చెప్పారు. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి కేసు గురించి మాట్లాడుతూ... చేసిన తప్పుకు ఎవరైనా శిక్షను అనుభవించాల్సిందేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు.

More Telugu News