ప్రధాని ఇండోనేషియా వెళతారు... వాళ్ల ఫ్రెండ్ కి గనులు వస్తాయి: కేటీఆర్

KTR replies to Eatala in Assembly session
  • అసెంబ్లీలో ఈటల, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం
  • సింగరేణిని ప్రైవేటుపరం చేయాలని కేంద్రం భావించడంలేదన్న ఈటల
  • బొగ్గు బ్లాక్ లు కేటాయిస్తే తెలంగాణ సర్కారు వద్దని లేఖ రాసిందని వెల్లడి
  • మీ పార్టీ విధానం ఏంటో చెప్పాలన్న కేటీఆర్ 
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ కు, మంత్రి కేటీఆర్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని ఈటల స్పష్టం చేశారు. కేంద్రం సింగరేణికి బొగ్గు బ్లాక్ లు కేటాయిస్తే, వద్దంటూ రాష్ట్రం ప్రభుత్వం లేఖ రాసిందని ఆరోపించారు. ఆ లేఖ తన వద్ద ఉందని వెల్లడించారు. 

అందుకు కేటీఆర్ బదులిస్తూ... దేశంలో బొగ్గు బ్లాక్ లు కొనుగోలు చేయవద్దని కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసిందని తెలిపారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాలను కోరిందని వెల్లడించారు. ఎవరి ప్రయోజనాల కోసం కేంద్రం ఆ విధంగా కోరుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. 

"ప్రధాని ఇండోనేషియా వెళతారు... వాళ్ల స్నేహితుడికి గనులు వస్తాయి. దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం మాది కాదు. మీ పార్టీ విధానం ఏంటో చెప్పాలి?" అని నిలదీశారు. కేంద్రం విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్మేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సింగరేణి విషయంలోనూ కేంద్రం ఇదే వైఖరితో ఉందని అన్నారు.
Advertisement
KTR
Eatala
Assembly
BRS
BJP
Telangana

More Telugu News