CS Jawahar Reddy: నేను, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఒకే వాహనంలో వెళ్లామనడం తప్పు: సీఎస్ జవహర్ రెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇటీవల ఏపీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లను విచారించడం తెలిసిందే. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు వీరిద్దరినీ ప్రశ్నించారు. అయితే, ఆ రోజున విచారణ అనంతరం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను తాను స్వయంగా కారులో తీసుకెళ్లానంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి మండిపడ్డారు. 

సీఎస్ తో కలిసి వెళ్లిన ఓఎస్డీ అంటూ రాసిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 3న తాను కడప జిల్లాలోని సింహాద్రిపురం, ముద్దనూరులో పర్యటించానని వెల్లడించారు. నాతో కలిసి ఓఎస్డీ కూడా కారులో ప్రయాణించారన్న కథనం ఊహాజనితమని, దారుణమైన అబద్ధమని అన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. 

ఉద్యోగులందరికీ అధినేత అయిన సీఎస్ ను చులకన చేసేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్ తప్పుడు కథనాలు వెలువరించాయని ఆరోపించారు. కుట్రపూరితంగా కట్టుకథను అల్లి అజెండా ప్రకారం తప్పుడు ప్రచారం చేశారని సీఎస్ వివరించారు. 

గౌరవప్రదమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిష్ఠకు భంగం కలిగించడం ఏ జర్నలిజం విలువల ఆధారంగా చేస్తున్నారు? అని ప్రశ్నించారు. తాను కోరిన విధంగా ఖండన ప్రకటన చేయకపోతే సదరు మీడియా సంస్థలపై చర్యలు తప్పవని అన్నారు.
CS Jawahar Reddy
OSD Krishna Mohan Reddy
Naveen
Media
YS Vivekananda Reddy
CBI

More Telugu News