కార్తీక దీపం చివరి ఎపిసోడ్ చూస్తుండగా విసిగించాడని వేలు కొరికేశాడు!

  • తెలంగాణ ములుగు జిల్లాలో ఘటన
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
  • విషయం తెలుసుకొని షాకైన పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో చాలామంది డైలీ సీరియల్స్ కు అలవాటు పడ్డారు. తమకు నచ్చిన సీరియల్ చూడకుండా నిద్రపోలేరు. అలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తి కార్తీకదీపం సీరియల్‌ ఆఖరి ఎపిసోడ్‌ చూస్తుండగా తనను విసిగించినందుకు మరొకరి చేతిని కొరికి రక్తం కళ్లజూశాడు. తెలంగాణ ములుగు జిల్లా వెంకటాపూర్‌ (రామప్ప) పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాలంపేటకు చెందిన గట్టు మొగిలి కిరాణా దుకాణం నిర్వహించడంతో మద్యం కూడా విక్రయిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన తాళ్లపెల్లి వెంకటయ్య జనవరి 23న రాత్రి దుకాణానికి వచ్చి మద్యం కొనుగోలు చేసి తాగాడు. అనంతరం అరువుకు మరికొంత మద్యం కావాలని అడిగాడు.

ఆ సమయంలో మొగిలి కార్తీక దీపం సీరియల్‌ చూస్తున్నాడు. వెంకటయ్య పదే పదే అరువుకు మద్యం అడుగుతూ విసిగించడం, అవతల కార్తీకదీపం చివరి సీరియల్ లో కీలక సన్నివేశాలు చూడలేకపోతున్నానని మొగిలి సహనం కోల్పోయాడు. కోపంతో వెంకటయ్యపై దాడి చేసి అతని కుడి చేతి చూపుడు వేలిని కొరికేశాడు. ఈ ఘటనపై వెంకటయ్య తర్వాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో కార్తీక దీపం చూస్తుంటే విసిగించడంతోనే వేలు కొరికేశానని దుకాణదారుడు మొగిలి చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.

Andhra Pradesh
Telangana
telugu
Karthika deepam
episode
man bite
finger

More Telugu News