ఉపాధ్యాయులు కూడా సాటి ఉద్యోగులే అనే విషయాన్ని పోలీసులు గుర్తించాలి: బండి సంజయ్
- జీవో 317తో ఉపాధ్యాయులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న సంజయ్
- ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న
- టీచర్లే స్కూళ్లలో బాత్రూమ్ లను కడగాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన
టీచర్ల బదిలీల్లో బీఆర్ఎస్ నేతలు పైరవీలు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. అనుకూలంగా ఉన్నవారికి కావాల్సిన చోట, అనుకూలంగా లేని వారికి మారుమూల ప్రాంతాల్లో పోస్టింగులు ఇస్తున్నారని అన్నారు. కారణం లేకుండానే 13 జిల్లాల్లో టీచర్ల స్పౌస్ బదిలీలను ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. స్కూళ్లలో పారిశుద్ధ్య కార్మికులను తొలగించారని... దీంతో, టీచర్లే బాత్ రూమ్ లను కడగాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న టీచర్ల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని... వారు కూడా సాటి ఉద్యోగులే అనే విషయాన్ని పోలీసులు గుర్తించాలని సూచించారు.