JEE Main: ఎల్లుండి నుంచే జేఈఈ మెయిన్.. ఇతర దేశాల్లోనూ రాయనున్న అభ్యర్థులు!

ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 290 నగరాలు, పట్టణాలతోపాటు ఇతర దేశాల్లోని 18 నగరాల్లో ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. బీటెక్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 24, 25, 29, 30, 31వ తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. అలాగే, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 28న పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.30 గంటలకు ముగుస్తుంది. 

ఎల్లుండి (24న) మొదటి విడత పరీక్ష రాసేవారు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ 6 నుంచి మొదలయ్యే మెయిన్ చివరి విడత ఎగ్జామ్స్ కోసం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. రెండు విడతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు. 

దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది పరీక్షకు హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది పరీక్ష రాయనున్నారు. అలాగే, ఈసారి తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబరిచిన వారిలో 2.50 లక్షల మంది మాత్రమే జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత సాధిస్తారు.
JEE Main
NTA
Exams
NIT

More Telugu News