Nellore District: నెల్లూరులో అర్ధరాత్రి రైలు ఢీకొని ముగ్గురి దుర్మరణం

Three dead In Railway Accident in Nellore
షార్ట్స్‌లో చూడండి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. గూడూరు నుంచి  విజయవాడ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఓ మహిళ, ఇద్దరు పురుషులు మృతి చెందారు. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్దనున్న రైల్వే బ్రిడ్జిపై ఈ ఘటన జరిగినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. వారి వయసు 45 నుంచి 50 ఏళ్లు మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో పురుషులు ఇద్దరూ పట్టాలపైనే ప్రాణాలు కోల్పోగా, మహిళ మాత్రం బ్రిడ్జి పై నుంచి కిందపడి చనిపోయింది.

పట్టాలపై ఉన్న మహిళను రక్షించే క్రమంలో పురుషులు కూడా ప్రమాదం బారినపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారా? లేదంటే, ఇంకెవరైనానా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో వారి చేతుల్లో ఉన్న సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం లాకర్ అలాట్‌మెంట్ టికెట్లు ఉన్నాయి. వాటితోపాటు సంచిలో ఉన్న ఫోన్ నంబరుకు పోలీసులు ఫోన్ చేస్తుంటే స్పందన లేదు.

అలాగే, మరో సంచిలో విజయవాడ కార్పొరేషన్‌కు చెందిన వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ తెన్నేటి సరస్వతీరావు పేరుతో ఉన్న గుర్తింపు కార్డు కూడా లభించింది. అందులోని ఫొటో ఆధారంగా మృతుల్లో ఆయన కూడా ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. టీటీడీ లాకర్ అలాట్‌మెంట్ స్లిప్పులో బి. రమేశ్ నాయక్ అని ఉంది. ఆధార్ కార్డు నంబరు కూడా దానిపై ఉండడంతో మృతి చెందిన వారిలో ఆయన కూడా ఉన్నారా? అన్న విషయమై పోలీసులు విచారిస్తున్నారు. లభించిన ఆధారాలను బట్టి వారు విజయవాడ నుంచి వెళ్తూ ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Nellore District
Rail Accident
Vijayawada
Andhra Pradesh
TTD

More Telugu News