రిషబ్ పంత్ కోసం ఆసుపత్రికి వెళ్లిన బాలీవుడ్ సీనియర్ నటులు

టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం తెలిసిందే. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళుతుండగా, పంత్ ప్రయాణిస్తున్న బెంజ్ కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో కాలిపోయింది. ఓ బస్ డ్రైవర్ చలవతో ఈ ప్రమాదం నుంచి పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. పంత్ కు ప్రస్తుతం డెహ్రాడూన్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో, బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ కు వెళ్లి, పంత్ ను పరామర్శించారు. డాక్టర్లను అడిగి పంత్ స్థితిని తెలుసుకున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

అనంతరం అనిల్ కపూర్ మీడియాతో మాట్లాడుతూ, పంత్ బాగానే ఉన్నాడని, అభిమానుల్లా పంత్ ను కలిశామని వివరించారు. పంత్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ అతడు క్రికెట్ మైదానంలో దిగాలని ప్రార్థిద్దామని తెలిపారు. 

అనుపమ్ ఖేర్ స్పందిస్తూ, ఆసుపత్రిలో పంత్ ను కలిశామని, పంత్ తల్లి, ఇతర బంధువులతో మాట్లాడామని వెల్లడించారు. ఎలాంటి ఆందోళన అవసరంలేదని అన్నారు. పంత్ ను తాము ఎంతగానో నవ్వించామని అనుపమ్ ఖేర్ తెలిపారు.

Rishabh Pant
Anil Kapoor
Anupam Kher
Dehradun
Road Accident
Team India
Bollywood

More Telugu News