Eknath Shinde: బిల్ క్లింటనే నా గురించి అడిగాడు... అదీ నా రేంజి: ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం ఫలితంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన ఏక్ నాథ్ షిండే తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన షిండే నా రేంజి ఇదీ అంటూ ఓ సంఘటనను వివరించారు. 

అమెరికాలో ఉండే ఓ వ్యక్తి నెల కిందట తనను కలిశాడని, ఆ వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు సన్నిహితుడు అని వెల్లడించారు. "ఆ వ్యక్తి ద్వారా నాకు తెలిసిన అంశం ఏమిటంటే... బిల్ క్లింటన్ నా గురించి అడిగారట. ఏక్ నాథ్ షిండే అంటే ఎవరు? ఆయన ఏంచేస్తారు? ఆయన గురించి వివరాలు ఏంటి? అని ఆరా తీశారట" అంటూ పరోక్షంగా తన రేంజి ఏ స్థాయికి చేరిందో సభికులకు వివరించారు. 

"కొందరు నా కథ ముగిసిందని అనుకుంటున్నారు. పాత్రికేయ మిత్రులు కూడా ఇదే మాట ప్రస్తావిస్తున్నారు. అయితే అన్ని అంశాలు చెప్పలేం. ఏది ఎలా ఉన్నా నాకు ప్రతీకార ధోరణి లేదు. ఎవరినీ దెబ్బతీసే మనస్తత్వం నాకు లేదు. మున్ముందు జరిగేది అందరూ చూస్తారు" అని షిండే వ్యాఖ్యానించారు.
Eknath Shinde
Bill Clinton
Maharashtra
USA

More Telugu News