Vijayasai Reddy: విశాఖలో డ్రోన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు రాజ్యసభలో డ్రోన్ టెక్నాలజీ అంశంపై మాట్లాడారు. ఏపీలోని విశాఖపట్నంలో డ్రోన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ డ్రోన్ టెక్నాలజీ అని తెలిపారు. వ్యవసాయం, సరకు రవాణా వంటి వివిధ రంగాల్లో డ్రోన్లను విరివిగా ఉపయోస్తున్నారని వెల్లడించారు. 

వ్యవసాయంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీలో ఇటీవల డ్రోన్ టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిందని అన్నారు. ఏపీలో 65 శాతం మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని, ఏపీలో ఐటీ నిపుణులకు కొదవలేదని, ఏపీలో పండ్లు, కూరగాయలు, వరితో పాటు ఇప్పుడు పామాయిల్ కూడా సాగు చేస్తున్నారని వివరించారు. అందుకే ఏపీలో డ్రోన్ పరిశోధన కేంద్రం స్థాపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

డ్రోన్లతో పురుగు మందులు చల్లడం, పొలంలో తేమను పరిశీలించడం, పంట పెరుగుదల వంటి అంశాల్లో డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయని, డ్రోన్ల వాడకం వల్ల రైతులకు కూలీల ఖర్చు చాలా తగ్గుతుందని విజయసాయి వివరించారు.
Vijayasai Reddy
Drone Research Center
Vizag
Rajya Sabha
YSRCP
Andhra Pradesh

More Telugu News