తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం... 12 మంది రాజీనామా!
- తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు
- రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్లు!
- ఇటీవల పీసీసీ కమిటీల ప్రకటన
- టీడీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శలు
ఈ నేపథ్యంలో నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగ్గా... 12 మంది నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ 12 మంది నేతలు గతంలో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరినవారే!
రాజీనామా చేసిన వారిలో ధనసరి సీతక్క, విజయరామారావు, నరేందర్ రెడ్డి, ఎర్ర శేఖర్, చారగొండ వెంకటేశ్ తదితరులు ఉన్నారు. వీరు తమ రాజీనామా లేఖలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణికం ఠాగూర్ కు పంపినట్టు తెలుస్తోంది.
రేవంత్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శులు కూడా హాజరయ్యారు.