సీఎం స్టాలిన్ భార్యకు ఆలయ ఛత్రం.. వివాదం!
- చెన్నైలో ఓ ఆలయంలో జరిగిన వేడుకలకు వెళ్లిన దుర్గ స్టాలిన్
- ఉత్సవమూర్తి గొడుగును దుర్గకు పట్టిన ఆలయ సిబ్బంది
- పవిత్రమైన గొడుగును సీఎం భార్యకు పట్టారని విమర్శలు
వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని ఓ ఆలయంలో జరిగిన వేడుకలకు స్టాలిన్ భార్య దుర్గ హజరయ్యారు. మాడ వీధిలో ఉత్సవమూర్తి ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తి వర్షంలో తడవకుండా ఉండేందుకు ఆలయ సిబ్బంది ఛత్రాన్ని పట్టుకున్నారు. అదే సమయంలో దుర్గ ఊరేగింపు వెనుక వస్తుండగా... ఆమె తడవకుండా ఓ ఉద్యోగి ఆలయ ఛత్రాన్ని పడుతూ అనుసరించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. స్టాలిన్ భార్యకు ఆలయ ఛత్రాన్ని వాడటం వివాదాస్పదమయింది. అత్యంత పవిత్రమైన ఆలయ గొడుగును స్టాలిన్ భార్య కోసం వాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది దేవాదాయశాఖలో జరిగిన పెద్ద తప్పిదమని బీజేపీ విమర్శించింది.
దీనిపై ఆలయ అధికారులు స్పందిస్తూ... సదరు ఆలయ ఉద్యోగి గొడుగును ఉత్సవమూర్తి వెనుక నుంచి తీసుకెళ్తుండగా, సీఎం భార్య వేగంగా నడుచుకుంటూ వెళ్లారని చెప్పారు. ఆలయ గొడుగును దుర్గకు పట్టలేదని తెలిపారు.