Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం: రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లిలకు కస్టడీ పొడిగించారు. ఈడీ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు వారిద్దరి కస్టడీని మరో ఐదు రోజులు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈడీ 9 రోజుల కస్టడీ కోరగా, న్యాయస్థానం ఐదు రోజులే మంజూరు చేసింది. 

కాగా, విజయ్ నాయర్ కు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక అంశాలు ప్రస్తావించింది. ప్రభుత్వంలోని పెద్దలకు రూ.100 కోట్ల వరకు ముందస్తు చెల్లింపులు జరిగినట్టు పేర్కొంది. అభిషేక్ బోయిన్ పల్లి, విజయ్ నాయర్ కలిసి లంచాలు ఇచ్చారని తెలిపింది. హోల్ సేల్ అమ్మకందారుల నుంచి డబ్బు వసూలు చేసి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని ఈడీ వివరించింది. ఈ రూ.100 కోట్ల ముడుపుల్లో రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్ పల్లి హైదరాబాద్ నుంచి హవాలా మార్గంలో దేశ రాజధానికి తరలించాడని పేర్కొంది. 

విజయ్ నాయర్ తనను తాను ఢిల్లీ ఎక్సైజ్ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడని వెల్లడించింది. మద్యం పాలసీని తమవారికి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని తెలిపింది. మద్యం పాలసీ... తయారీకి రెండు నెలల ముందే విజయ్ నాయర్ చేతుల్లోకి వచ్చేసిందని ఈడీ పేర్కొంది.
Delhi Liquor Scam
ED
Remand Report
Vijay Nair
Abhishek Boyinpally

More Telugu News