హృద్రోగులకు శుభవార్త.. ఇకపై అందుబాటులో ‘కరోనరీ స్టెంట్’

  • జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్‌ను చేర్చిన కేంద్రం
  • స్టాండింగ్ నేషనల్ కమిటీ ఆన్ మెడిసిన్స్’  సిఫార్సుల మేరకు నిర్ణయం
  • జాబితాలో కొత్తగా చేరిన 34 మందులకు ఇది అదనం
హృద్రోగ బాధితులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారికి అత్యవసర సమయాల్లో వాడే ‘కరోనరీ స్టెంట్’ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో దానిని చేర్చింది. ఫలితంగా ఇది అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ నియమించిన ‘స్టాండింగ్ నేషనల్ కమిటీ ఆన్ మెడిసిన్స్’ చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

తీవ్రత ఎక్కువగా ఉన్న వ్యాధులకు సంబంధించిన మందులను అందరికీ అందుబాటు ధరల్లో ఉంచేందుకు వీలుగా ‘నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్-2022’ను కేంద్రం రూపొందించింది. ఇప్పుడీ జాబితాలోకి కరోనరీ స్టంట్‌ను చేర్చింది. ఫలితంగా ఇకపై ఇది అందరికీ అందుబాటు ధరల్లో ఉండనుంది. 

సెప్టెంబరు 13న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అత్యవసర మందుల జాబితాను విడుదల చేశారు. ఇందులో 27 కేటగిరీలకు చెందిన 384 ఔషధాలను చేర్చారు. అంతేకాదు, 2015 నాటి జాబితాలో ఉన్న 26 మందులను ఈ తాజా జాబితా నుంచి తొలగించి కొత్తగా 34 మందులను చేర్చారు. ఇప్పుడు వీటికి అదనంగా కరోనరీ స్టెంట్‌ను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Coronary Stent
Heart Patient
Essential Medicine

More Telugu News