పాకిస్థాన్‌లో భద్రతా దళాల ఆపరేషన్.. టీటీపీ ఉగ్రవాద కమాండర్ హతం

  • పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించిన భద్రతా దళాలు
  • పాక్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఒబైద్
  • ఈ నెల 7న మరో కమాండర్ లియాఖత్‌ను మట్టుబెట్టిన పోలీసులు
పాకిస్థాన్ భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో 'తెహ్రీక్-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్' (టీటీపీ) ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ ఒబైద్ అలియాస్ మొహమూద్ హతమయ్యాడు. ఒబైద్ తలపై రూ. 50 లక్షల రివార్డు ఉంది. మర్దాన్ జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ అధికారి సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఫరీద్ ఖాన్‌ ఆయన ఇంటి ముందే హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఒబైద్ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. అనేక ఉగ్రదాడుల్లోనూ పాల్గొన్న ఒబైద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా పోలీసుల రికార్డులకెక్కాడు.

దీంతో ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రభుత్వం గతంలో అతడి తలపై రూ. 50 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వాకు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం పోలీసులు పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలో నిన్న రాత్రి నిర్వహించిన ఆపరేషన్‌లో ఒబైద్ హతమయ్యాడు. కాగా, ఈ నెల 7న ఖైబర్ జమ్రుద్ తహసీల్ పరిధిలో టీటీపీ కమాండర్, పెషావర్, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుడైన లియాఖత్‌ను పోలీసులు హతమార్చారు.

Pakistan
TTP
Khyber Pakhtunkhwa
Obaid

More Telugu News