Munugode: మునుగోడులో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే...!

  • ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
  • మొత్తం 15 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు
  • 10,309 ఓట్ల తేడాతో కూసుకుంట్ల గెలుపు
  • మునుగోడులో టీఆర్ఎస్ విజయభేరి
  • ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Munugode bypolls counting completed

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 15 రౌండ్ల పాటు ఓట్లు లెక్కించారు. నల్గొండలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ గోడౌన్ కౌంటింగ్ ప్రక్రియకు వేదికగా నిలిచింది. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను లెక్కించారు.

తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం సంపాదించగా... 2, 3 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందంజ వేశారు. ఆ తర్వాత 14వ రౌండ్ వరకు టీఆర్ఎస్ జోరు కొనసాగింది. 

చివరిదైన 15వ రౌండ్ లో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ లో రాజగోపాల్ రెడ్డికి 1,358 ఓట్లు లభించగా, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 1,270 ఓట్లు వచ్చాయి. 

కాగా, 12 రౌండ్ల అనంతరమే టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది. అప్పటికే కూసుకుంట్ల మెజారిటీ 7 వేల పైచిలుకులో ఉంది. కీలకంగా నిలిచిన గట్టుప్పల్ మండలంలో టీఆర్ఎస్ కు గంపగుత్తగా ఓట్లు పోలైనట్టు తెలిసింది. 

ఓవరాల్ గా 15 రౌండ్ల అనంతరం చూస్తే... టీఆర్ఎస్ కు 97,006 ఓట్లు, బీజేపీకి 86,697 ఓట్లు, కాంగ్రెస్ కు 23,906 ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల తేడాతో విజయం సాధించి మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

More Telugu News