papikondalu: త్వరలో పాపికొండల యాత్ర.. ప్రారంభానికి పర్యాటక శాఖ అనుమతి

Boating operations to Papikondalu Tour likely to resume soon
  • నదిలో నీటిమట్టం తగ్గడంతో యాత్రకు ఏర్పాట్లు 
  • హర్షం వ్యక్తం చేస్తున్న తెలుగు రాష్ట్రాల పర్యాటకులు 
  • వేసవిలోనూ కొనసాగుతున్న విహారయాత్ర
ప్రకృతి అందాల మధ్య గోదావరి నదిపై పడవ ప్రయాణం మళ్లీ మొదలుకాబోతోంది. గోదావరికి వరదలు తగ్గడంతో పాపికొండల విహార యాత్రను మళ్లీ ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అనుమతిచ్చింది. దీంతో గోదావరి అలలపై సాగే బోటు ప్రయాణం త్వరలోనే మొదలు కానుంది. ఇటీవలి వరదలకు సుమారు మూడు నెలల పాటు పాపికొండల యాత్ర ఆగిపోయింది. ప్రస్తుతం నదిలో నీటి మట్టం తగ్గడంతో యాత్రను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గోదావరిలో బోట్ ట్రయల్ రన్ నిర్వహించారు. గండిపోశమ్మ ఆలయం వద్ద పర్యాటకులు బోటెక్కడానికి వీలుగా పంటు ఏర్పాటుచేశారు. పోచమ్మగండి వద్ద బోట్ల పర్యాటక ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో సంక్రాంతి తర్వాత పాపికొండల యాత్రను నిలిపేసేవారు.. నదిలో నీటిమట్టం తగ్గడంతో ఇసుక దిబ్బలకు తగిలి బోట్లు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో యాత్రను ఆపేసేవారు. అయితే, పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంతో పాపికొండల్లో గోదావరి నీటిమట్టం బాగా పెరిగింది. దీంతో వేసవిలోనూ కొనసాగించాలని ఈ ఏడాది మొదట్లోనే అధికారులు నిర్ణయించారు.

More Telugu News

papikondalu
boat tour
Andhra Pradesh
tourism