పాదయాత్రలో చిన్నారులతో రాహుల్ గాంధీ పరుగు పందెం.. వెంట పరుగెత్తిన రేవంత్ రెడ్డి

 Rahul Gandhi Sprints Others Follow
  • తెలంగాణలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
  • ఐదో రోజులో భాగంగా ఈ ఉదయం జడ్చర్లలో యాత్ర ప్రారంభం
  • చిన్నారులతో కలిసి కాసేపు రన్నింగ్ చేసిన రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఐదో రోజు యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం జడ్చర్లలో రాహుల్ పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులందరినీ ఉత్తేజ పరిచారు. యాత్రలో నడుస్తున్న రాహుల్ వద్దకు కొంతమంది చిన్నారులు వచ్చారు. ఇంతలో మనం పరుగెడదామా.. రెడీ వన్ టు త్రీ అంటూ ఆయన రన్నింగ్ మొదలు పెట్టారు. రాహుల్ ను చూసి పక్కనే ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు అందుకున్నారు. మిగతా నాయకులు, భద్రతా సిబ్బంది కూడా పరుగెత్తారు. అలా కొద్దిదూరం వెళ్లిన తర్వాత పరుగు ఆపిన రాహుల్ మళ్లీ నడవడం కొనసాగించారు. రాహుల్ పరుగెత్తడం చూసి అక్కడున్నవాళ్లంతా కేరింతలు కొట్టారు. 

రాహుల్ ఈ రోజు 22 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సాయంత్రం ఆయన షాద్‌నగర్‌లోని సోలిపూర్ జంక్షన్ వద్ద సభలో పాల్గొంటారు. నవంబర్ ఏడో తేదీ వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 375 కి.మీ నడుస్తూ 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాలను రాహుల్ కవర్ చేయనున్నారు. నవంబర్ 4న యాత్రకు ఒకరోజు విరామం ఇస్తారు. రాష్ట్రంలో పాదయాత్ర జరిగే సమయంలో రాహుల్ గాంధీ క్రీడా, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులతో సహా మేధావులు, వివిధ సంఘాల నాయకులతో సమావేశమవుతారు. కాగా, భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది.
Go Back to Shorts
Telangana
Congress
Rahul Gandhi
Revanth Reddy

More Telugu News