స్వాధీనం చేసుకున్న డబ్బు ఎక్కడుందో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పాలి: బండి సంజయ్ డిమాండ్
- ఎమ్మెల్యేలను కొనాలని యత్నించారని ప్రచారం చేస్తున్నారన్న సంజయ్
- తాను యాదాద్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపాటు
- మునుగోడులో టీఆర్ఎస్ గెలవదనే దొంగదారిని వెతికారని ఎద్దేవా
ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని... డబ్బు దొరికిందని ప్రచారం చేస్తున్నారని సంజయ్ అన్నారు. కొనుగోలుకు కుట్ర జరిగిందని చెపుతూ ఏసీబీ కోర్టుకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. డబ్బు దొరికింది నిజమైతే.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎక్కడుందని అడిగారు. దీనికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను యాదాద్రి వెళ్లకుండా అడ్డుకోవాలని సీఎం కార్యాలయం నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయని మండిపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవదని... అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ అన్నారు. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయని తెలిపారు. అందుకే దొంగదారిని వెతికారని... అయితే అనుకున్నట్టు జరగకపోవడంతో డీలా పడ్డారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన పని ప్రజలందరికీ తెలిసిపోయిందని... మునుగోడు పోటీ నుంచి టీఆర్ఎస్ తప్పుకోవడం మంచిదని అన్నారు.