Andhra Pradesh: ఏపీలో చింతూరు కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు

  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా రెవెన్యూ డివిజన్
  • చింతూరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  •  చింతూరు, ఏటిపాక, కూనవరం, వర రామచంద్రాపురం మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్
  • చింతూరుతో 74కు చేరిన రెవెన్యూ డివిజన్ల సంఖ్య
ap government announces new revenue division in chituru in alluri seetharanaraju district

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు... అదే క్రమంలో కొత్త రెవెన్యూ డివిజన్లు, రెవెన్యూ మండలాల ఏర్పాటు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. 13 జిల్లాలుగా ఉన్న ఏపీని 26 జిల్లాలుగా మార్చిన వైసీపీ ప్రభుత్వం... రాష్ట్రాన్ని 74 రెవెన్యూ డివిజన్లుగా విభజించింది. నిన్నటిదాకా రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73గా ఉండగా... మంగళవారం కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 5 మండలాలతో ఓ కొత్త రెవన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసింది. చింతూరు కేంద్రంగా ఏర్పాటైన కొత్త రెవెన్యూ డివిజన్ తో కలుపుకుని రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరింది. ఈ మేరకు చింతూరు రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటిదాకా పాడేరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉన్నాయి. అయితే చింతూరుతో పాటు ఏటిపాక, కూనవరం, వర రామచంద్రాపురం మండలాలకు చెందిన ప్రజలు తమకు మరో కొత్త రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా కోరుతున్నారు. వీరి డిమాండ్లను పరిశీలించిన ప్రభుత్వం చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసింది. ఈ రెవెన్యూ డివిజన్ తో 3 మండలాల ప్రజలకు పాలనా పరంగా భారీ ఊరట లభించనుంది.

More Telugu News